మెగా ఫ్యామిలీ.. రికార్డుల‌కు లోగిలి..


అవును.. ఇప్పుడు చూస్తుంటే ఇదే నిజం అనిపిస్తుంది. టాలీవుడ్ లో ఎన్ని కుటుంబాలున్నా.. ఎంత‌మంది హీరోలున్నా మెగా ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ మాత్రం వేరు. ఇది మరోసారి రంగ‌స్థ‌లంతో నిరూపిత‌మైంది. ఈ చిత్రం సృష్టిస్తోన్న సంచ‌ల‌నాలు చూసి వామ్మో అనుకోకుండా ఉండ‌లేరు. ఇప్ప‌టికే టాలీవుడ్ రికార్డుల‌న్నీ మెగా ఫ్యామిలీ చేతుల్లోనే ఉన్నాయి. బాహుబ‌లిని ప‌క్క‌న‌బెడితే నాన్ బాహుబ‌లి మొత్తం మెగావాకిట్లోనే ఉంది.
హైయ్య‌స్ట్ డే వ‌న్.. హైయ్య‌స్ట్ ఫ‌స్ట్ వీక్.. హైయ్య‌స్ట్ క‌లెక్ష‌న్స్.. ఇలా అన్నీ మెగాహీరోల చేతుల్లోనే ఉన్నాయి. నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో చిరంజీవి ఖైదీ నెం. 150 104 కోట్లతో ముందుంది.. ఇక ఫ‌స్ట్ వీక్ కూడా ఖైదీ పేరు మీదే 76 కోట్ల‌తో ఉంది. ఇక డే వ‌న్ 40 కోట్ల షేర్ తో అజ్ఞాతవాసి ఉంది. ఓవ‌ర్సీస్ లో కూడా నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో డే వ‌న్ రికార్డ్ అజ్ఞాత‌వాసి పేరు మీదే ఉంది. ఈ చిత్రం తొలిరోజే 1.5 మిలియన్ వ‌సూలు చేసింది. దీనికితోడు ఇప్పుడు రంగ‌స్థ‌లం మూడు రోజుల్లోనే 2 మిలియ‌న్ మార్క్ అందుకుంటుంది. ఇది కూడా ఓ రికార్డే.
ఒక‌టి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎన‌మిది.. తొమ్మిది.. ప‌ది.. అంటూ లెక్క పెట్టుకుంటూనే వెళ్తున్నారు మెగా హీరోలు. ఒక్క ఫ్యామిలీ నుంచి ఇంత‌మంది హీరోలు రావ‌డం.. దాదాపు అంద‌రూ క్లిక్క‌వ్వ‌డం అనేది బ‌హుశా ప్ర‌పంచ సినిమా ఇండ‌స్ట్రీలో ఎక్క‌డా జ‌ర‌గ‌లేదేమో..! చిరంజీవి మెగా ఫ్యామిలీకి ఆద్యుడు. మెగాస్టార్ గా మూడు ద‌శాబ్దాల పాటు తెలుగు తెర‌ను ఏలారాయ‌న. ఇప్ప‌టికీ ఆయ‌న సినిమా వ‌స్తే రికార్డులు బ‌ద్ద‌లైపోతున్నాయి.
ఈయ‌న పేరు చెప్పుకుని వ‌చ్చిన నాగ‌బాబు హీరోగా నిల‌బ‌డ‌క‌పోయినా.. కారెక్ట‌ర్ ఆర్టిస్టుగా నిల‌దొక్కుకున్నారు. అన్న చాటు త‌మ్ముడిగా 20 ఏళ్ల కింద ఇండ‌స్ట్రీకి వ‌చ్చాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్. అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయితో ప్ర‌స్థానం మొద‌లుపెట్టి.. అన‌తి కాలంలోనే అన్న‌ను మించిన త‌మ్ముడిగా మారాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ది ఓ స్పెష‌ల్ జ‌ర్నీ. ఆయ‌న‌దో స‌పరేట్ స్టైల్. ప‌వ‌న్ అంటే ఇప్పుడు ఓ శిఖ‌రం. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి పేరు చెప్పుకుని వ‌చ్చిన మ‌రో ఇద్ద‌రు స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్, అల్లుఅర్జున్. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టి కుర్ర హీరోల్లో టాప్ పొజిష‌న్ ఎంజాయ్ చేస్తున్న‌వారే.
ఇన్నాళ్లూ కాస్త వెన‌క‌బ‌డిన‌ట్లు క‌నిపించిన రామ్ చ‌ర‌ణ్.. ఇప్పుడు రంగ‌స్థ‌లంతో ఏకంగా ఇండ‌స్ట్రీ రికార్డుల‌కే చెక్ పెడుతున్నాడు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 50 కోట్ల షేర్ అందుకుంది. చూస్తుంటే వారం రోజుల్లో 75 కోట్ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక అల్లుఅర్జున్ కూడా రికార్డుల వేట‌లో ముందే ఉన్నాడు. ఈయ‌న సినిమాలు యావ‌రేజ్ టాక్ తో కూడా 70 కోట్లు వ‌సూలు చేస్తున్నాయి. ఈ మ‌ధ్యే ఈ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన మ‌రో ముగ్గురు కుర్రాళ్లు వ‌రుణ్ తేజ్, సాయిధ‌రంతేజ్, అల్లుశిరీష్. వీళ్ల‌లో మెగా మేన‌ల్లుడు సాయిధ‌రంతేజ్ కొత్త‌లో సంచ‌ల‌నాలు సృష్టించాడు.
వ‌రుణ్ తేజ్ మాత్రం ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.. దున్నేస్తున్నాడు. వీళ్లు చాల‌ర‌న్న‌ట్లు కొణిదెల నిహారిక సైతం ఒక మ‌న‌సు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇంత‌మంది హీరోలు ఉండ‌గానే చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్.. సాయిధ‌రంతేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ వ‌స్తున్నారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ కాస్తా ఇప్పుడు రికార్డుల‌కు లోగిలిలా మారిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here