నేను డబుల్ మెచ్యూరిటీతో చేస్తున్న సినిమా ఇది !!- అక్కినేని నాగార్జున

I am doing this movie with double maturity - Nagarjuna

“శివ, అంతం, గోవింద గోవింద” వంటి సెన్సేషనల్ హిట్స్ అనంతరం రాంగోపాల్ వర్మ-అక్కినేని నాగార్జునల క్రేజీ కాంబినేషన్ లో దాదాపు 28 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రూపొందుతున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు (నవంబర్ 20) అన్నపూర్ణ స్టూడియోస్ లో అత్యంత ఘనంగా రాంగోపాల్ వర్మ శిష్యగణం, నాగార్జున మిత్ర బృందం సమక్షంలో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు రాంగోపాల్ వర్మ తల్లి సూర్యావతి క్లాప్ కొట్టారు. యార్లగడ్డ సురేంద్ర కెమెరా స్వీచ్చాన్ చేయగా.. వర్మ తొలి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు. కంపెనీ పతాకంపై రాంగోపాల్ వర్మ-సుధీర్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

“నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పినా చెప్పకపోయినా నిన్ను చంపడం గ్యారంటీ. ఎంత త్వరగా చెబితే అంత త్వరగా,తక్కువ నొప్పితో చస్తావ్ . చూజ్ ..!” అని నాగార్జున చెప్పిన డైలాగ్ తో లాంఛనంగా ప్రారంభమైన నాగార్జున-రాంగోపాల్ వర్మల నాలుగో చిత్రం రెగ్యులర్ షూట్ ఇవాల్టి నుంచి 10 రోజుల  వరకూ కంటిన్యూగా జరుగుతుంది.

ఈ సందర్భంగా దర్శకులు రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. “నేను దేవుడ్ని నమ్మను కానీ నాగార్జునను నమ్ముతాను. అందుకు కారణం ఆయన నన్ను నమ్మి “శివ” సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇవ్వడమే కాక నాకు పూర్తిస్థాయి స్వేచ్ఛనిచ్చారు. నేను చెప్పిన కథ విన్న తర్వాత నాగార్జున “మళ్ళీ పాత వర్మ కనిపించాడు” అని చెప్పడంతో నా మీద నాకున్న నమ్మకం ఇంకాస్త పెరిగింది. గత కొన్నేళ్ళగా “రాంగోపాల్ వర్మకు మైండ్ దొబ్బింది, జ్యూస్ అయిపోయింది” అంటున్నారు. అయితే.. మైండ్ దొబ్బింది అన్న మాట నిజమే కానీ “జ్యూస్ అయిపోయిందా లేదా?” అనే విషయం మాత్రం సినిమా చూశాక మీకే తెలుస్తుంది” అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ.. “ముందుగా నేను చెప్పాల్సిన మాట “నాకు మైండ్ దొబ్బలేదు, నా మైండ్ బానే ఉంది”. చాలారోజుల తర్వాత ఉదయం 4.00 గంటలకు ఎగ్జయిట్ మెంట్ తో నిద్రలేచాను. రోజూ ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది. “శివ” టైమ్ లోనూ హిట్-ఫ్లాప్ అనే విషయం పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోదలచుకోలేదు. ఎందుకంటే.. వర్మకు నాకూ మధ్య ఉన్న నమ్మకం అలాంటిది. ఇవాళ వర్మ అమ్మగారిని కలిశాను, ఆవిడను చూస్తే మా అమ్మ గుర్తోచ్చారు. ఒక ఆర్టిస్ట్ కి 28 ఏళ్లకి మెచ్యూరిటీ వస్తుందట, నాకు సరిగ్గా 28 ఏళ్లప్పుడు “శివ” వచ్చింది. మళ్ళీ సరిగ్గా 28 ఏళ్ల తర్వాత డబుల్ మెచ్యూరిటీతో చేస్తున్న సినిమా ఇది. వర్మ పెద్దమ్మ ఝాన్సమ్మగారు నన్ను చంకనెక్కించుకొని తిరిగేవారు. మా అనుబంధం అప్పటిది. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎలా ముందుకు సాగాడు అనేది సినిమా కాన్సెప్ట్. ఒక యునీక్ కాన్సెప్ట్ తో వర్మ చాలా డెడికేటెడ్ గా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. హై టెక్నికల్ స్టాండర్డ్స్ తో ఈ సినిమా తీస్తానని వర్మ నాకు ప్రామిస్ చేశాడు. వర్మ చెప్పిన కొన్ని సన్నివేశాల కోసం నేను ఎదురుచూస్తున్నాను. ఇవాల్టి నుంచి షూట్ మొదలవుతుంది. ఒక పదిరోజులపాటు ఏకధాటిగా షూటింగ్ నిర్వహించి తర్వాత అఖిల్ సినిమా “హెల్లో” రిలీజయ్యాక మరో షెడ్యూల్ ను స్టార్ట్స్ చేసి.. ఆ షెడ్యూల్ తో సినిమా పూర్తి చేస్తాం” అన్నారు.

ఈ కార్యక్రమంలో అక్కినేని వెంకట్, పూరి జగన్నాధ్, జె డి చక్రవర్తి, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు