ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు చేతుల మీదుగా జొన్న‌విత్తుల ప‌ద్య వాద్య క‌చేరి విడుద‌ల‌…(తెలుగు సాహిత్యంలో సరి కొత్త పద్య సృష్టి)


తెలుగు పదాలకు పద్యాలకు వన్నె తెచ్చిన కవులు మన చరిత్రలో చాలా మందే వున్నారు. పాశ్చాత్యపు పోకడలతో మన సాహిత్యానికి దూరమవుతున్న నేటి యువతను సైతం తన ఇంపైన పదాలతో సొంపైన సాహిత్యాన్ని అల్లి తన వైపు తిప్పుకున్న ప్రముఖ తెలుగు కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు. కొన్ని వంద‌ల పాట‌లు రాసిన సినీ గీత ర‌చ‌యిత‌. అంతేనా…తెలుగు అధికార భాషా సంఘంలో స‌భ్యుడుగా ఉంటూ తెలుగు భాషాభివృద్ది కోసం త‌న వంతు స‌హ‌కారాన్ని అందించారు. పేర‌డీ పాట‌లు రాయ‌డంలో దిట్ట అయిన జొన్న‌విత్తుల తెలుగు భాషాభిమానుల కోసం ప‌ద్య వాద్య క‌చేరి అందించారు.
ఇంత‌కీ… ప‌ద్య వాద్య క‌చేరి అంటే ఏమిటంటారా..? ప‌ద్యంలో వెలువ‌డే ధ్వ‌నుల‌ను…వాద్యం నుంచి వ‌చ్చే ధ్వ‌నుల‌ను రెండింటిని క‌ల‌గ‌లిపి విచిత్ర‌మైన‌టువంటి… ర‌స‌వ‌త్త‌ర‌మైన భావ‌ముల‌తో పద్యాన్ని ప‌లికించ‌డం ఈ ప‌ద్య వాద్య క‌చేరి ఉద్దేశ్యం. ఒక అక్ష‌రాన్ని అచ్చ‌రించిన‌ప్పుడు దాని నుంచి చ‌క్క‌టి నాదం వ‌స్తుంది, వాద్యాన్ని వెల‌వ‌రించిన‌ప్పుడు కూడా చ‌క్క‌ని నాదం వెలువ‌డుతుంది. అక్ష‌ర నాదం.. స్వ‌ర‌నాదం.. రెండింటిని క‌ల‌గ‌లిపి విచిత్రంగా ప‌ద్యాన్ని అందించ‌డ‌మే దీని ప్ర‌ధాన ఉద్దేశ్యం.
ప్రతిభ ఎవరికున్నా, ఎలా వున్నా అది కనపడేది మాత్రం సరైన వేదిక మీదే. సరైన ప్రతిభను గుర్తించడమే కాదు, ఆ ప్రతిభను పది మంది ముందుకు తీసుకువెళ్ళడంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎప్పుడూ ముందుంటుంది. జొన్నవిత్తుల గారి పద్య వాద్య కచేరికి సరిగ్గా ఆ ప్రయత్నమే చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాణంలో డైరెక్ట‌ర్ వి.ఎన్.ఆదిత్య‌, స‌హ నిర్మాత‌ వివేక్ కూచిభోట్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన జొన్న‌విత్తుల ప‌ద్య వాద్య క‌చేరి సీడీని ఏపీ సి.ఎం చంద్రబాబు నాయుడు ఈరోజు (21) అమ‌రావ‌తిలోని సి.ఎం క్యాంప్ ఆఫీస్ లో ఆవిష్క‌రించారు. తెలుగు భాషాభిమానుల కోసం వినూత్నంగా జొన్న‌విత్తుల ప‌ద్య వాద్య క‌చేరి ని రూపొందించిన టీమ్ ని చంద్ర‌బాబు అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, ప్ర‌ముఖ తెలుగు క‌వి, గీత ర‌చ‌యిత జొన్న‌విత్తుల పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here