అందరూ ఇది మన కథ అనుకోని చూడాల్సిన సినిమా "నీది నాది ఒకే కథ" – ప్రీరిలీజ్ ఈవెంట్ లో యువకథానాయలు


శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చ్ 23 న విడుదల కానుంది. టీజర్ మరియు పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు. టీజర్ లో చిత్తూర్ యాసలో శ్రీ విష్ణు పలికిన ఘాటైన డైలాగులకు యూత్ ను విశేషంగా ఆకట్టుకొని చిత్రం పై ఆసక్తిని భారీగా పెంచేసాయి.
ఇప్పటివరకు విడుదలైన పాటలు కూడా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ జతగా కనిపించనున్నారు. ప్రశాంతి, కృష్ణ విజయ్ మరియు అట్లూరి నారాయణ రావు అరాన్ మీడియా వర్క్స్ మరియు శ్రీ వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించారు.విడుదలను పురస్కరించుకొని చిత్ర బృందం హైద్రాబాద్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో నారా రోహిత్, శర్వానంద్, రాజ్ కందుకూరి, జి.నాగేశ్వర్రెడ్డి, దేవీ ప్రసాద్, సురేష్ బొబ్బిలి వంటి ప్రముఖులందరూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారా రోహిత్‌ మాట్లాడుతూ.. ”ఈ కథను శ్రీవిష్ణు చెప్పినప్పుడు నాకు నా స్నేహితుడు ఒకడు గుర్తుకు వచ్చాడు. తను ఇంటర్‌ చదివే రోజుల్లో నేషనల్‌లో బాస్కెట్‌ బాల్‌కి సెలక్ట్‌ అయితే వాళ్ల ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో తను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అయ్యాడు. అలాంటి వాళ్ల జీవితాలను తెరపై చూపే చిత్రమిది. అందరికీ కచ్చితంగా కనెక్ట్‌ అవుతుంది. విజయ్‌, ప్రశాంతిలకు థాంక్స్‌. వేణుగారు మంచి సినిమాను డైరెక్ట్‌ చేసినందుకు థాంక్స్‌. ఒక మంచి కథను సినిమా చేద్దామని తీసుకు వచ్చిన శ్రీవిష్ణుకి థాంక్స్‌. సినిమా ఈ నెల 23న విడుదలవుతుంది” అన్నారు.
శర్వానంద్‌ మాట్లాడుతూ.. ”ఈ సినిమా ట్రైలర్‌ చూడగానే మార్నింగ్‌ షో చూడాలనిపించింది. అంతే కాకుండా.. ఈ సినిమాను నేను కొనుక్కుంటే బావుంటుందనిపించి.. విజయ్‌కి కాల్‌ చేశాను. కానీ అప్పటికే సినిమా బిజినెస్‌ పూర్తయ్యింది. మంచి సినిమాను మిస్‌ చేసుకున్నానే అనిపిస్తుంది. ఇలాంటి మంచి సినిమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. గత ఏడాది, ఈ ఏడాది కొత్త దర్శకులు మంచి కథలతో సినిమాలు చేస్తున్నారు. ట్రైలర్‌ చూసి శ్రీవిష్ణుకి నేను పెద్ద ఫ్యాన్‌ అయ్యాను. నా కథలాగా అనిపించింది. సినిమా ఎంతో నిజాయితీగా ఉండబోతుందనిపిస్తుంది. రోహిత్‌ ఓ మంచి ఫ్రెండ్‌లా శ్రీవిష్ణుకి వెనుక నిలబడి సపోర్ట్‌ చేస్తున్నాడు. అందరూ సినిమాకు సపోర్ట్‌ అందించాలి” అన్నారు.
శ్రీవిష్ణు మాట్లాడుతూ.. “వేణుగారు కథ చెప్పినప్పుడు ‘ఎంట్రా ఇదేదో నా స్టోరీలాగే ఉందే’ అనిపించింది. నన్ను ఏదో పక్కంట్లోనో, ఎదురింట్లోనో ఇండి గమనించి సినిమా కథ రాసుకున్నారనిపించింది. నాకోసమైనా సినిమా చేయాలి. ఎందుకంటే ఎప్పుడైనా నా జీవితాన్ని సినిమాగా చూసుకోవాలంటే చూసుకోవచ్చు అనిపించి.. సరే సినిమా చేద్దాం. నాకు, దర్శకుడికే కాదు.. సినిమాలో పనిచేసే అసిస్టెంట్‌ దర్శకులు సహా అందరికీ కనెక్ట్‌ అయ్యింది. సినిమా రిజల్ట్‌ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు.
సినిమా చూసిన తర్వాత మా సినిమా గురించి నలుగురైదుగురు మాట్లాడుకుంటే చాలనిపించింది. సినిమా చూసిన వారందరూ ‘సినిమా భలే ఉందే’ అన్నారు. సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉన్నాను. చాలా మంది సోసైటీ కోసం చదువుతుంటారు. మనకు నచ్చిన పని చేయడానికి ఇంట్లో వాళ్లని ఒప్పించడానికి ప్రయత్నించాలి. ఒక అమ్మాయి వెనుకబడి ప్రేమ కోసమే ఒప్పించేటప్పుడే.. జీవితం కోసం ఎంత ఒప్పించాలని చెప్పేది సినిమా. తల్లిదండ్రులు కూడా పిల్లలకు సపోర్ట్‌ ఇస్తే చాలు.
తల్లిదండ్రులే వారి పిల్లల్ని నమ్మాలి. మీరే నమ్మకపోతే..రేపు ప్రపంచం ఏం నమ్ముతుంది. కాబట్టి చదువుని చదువులాగానే ఉంచుదాం. మనకు దగ్గరగా ఉండే సినిమా ‘నీది నాది ఒకే కథ”’ అన్నారు.
రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ.. ”ఈ మధ్య విడుదలైన సినిమాలను గమనిస్తే కొత్త డైరెక్టర్స్‌ ప్రభంజనం సృష్టిస్తున్నారు. అదే కోవలోకి వేణు ఉడుగుల కూడా రాబోతున్నాడని నేను కచ్చితంగా చెప్పగలను” అన్నారు.
జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ”నారా రోహిత్‌ హీరోగానే కాదు.. నిర్మాతగా కూడా కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నారు. ఇండస్ట్రీకి నిర్మాతే ప్రాణం అని నమ్మే వాళ్లలో నేను ఒకడ్ని. ఈ సినిమా ట్రైలర్‌ చూడగానే సినిమా పెద్ద హిట్‌ అవుతుందనే వైబ్రేషన్‌ కలిగింది. ఆకలిరాజ్యం సినిమాలో తండ్రి కొడుకుల మధ్య జరిగే సంఘర్షణ అలాగే గుర్తుండి పోయింది. చాలా సంవత్సరాలు మనకు గుర్తుండిపోయిన ఆకలిరాజ్యం సీన్‌ను నాకు గుర్తుకు తెచ్చిన సినిమా ఇది. ఆ సినిమాలాగానే ఈ సినిమా కూడా మనకు గుర్తుండి పోతుంది. అందరికీ అభినందనలు” అన్నారు.
దేవీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ”వేణు ఉడుగుల ఇష్టం.. కష్టమే ఈ సినిమా. నేను డైరెక్షన్‌ చేసిన తర్వాత నన్ను నటించమని చాలా మంది అడిగారు. కానీ నేను నటించలేదు. ఎప్పుడైతే వేణుగారు కథ చెప్పారో నాకు బాగా నచ్చేసింది. ఇలాంటి కథతో నిర్మాతలు సినిమా చేయడమనేది గొప్ప విషయం. ఎంతో ప్యాషన్‌ ఉంటే కానీ నిర్మాతలు సినిమాలు చేయరు. కాబట్టి ఈ సినిమా విషయంలో నిర్మాతలను ముందుగా అభినందించాలి. హీరో తర్వాత అంత ఎమోషన్స్‌ ఉన్న క్యారెక్టర్‌ నాదే. మొదటిరోజు షూటింగ్‌ అయిన తర్వాత.. తను గొప్ప దర్శకుడు కాబోతున్నాడని నేను చెప్పాను. తనకి ఎంతో క్లారిటీ ఉంది. జీవితంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని చెప్పే సినిమా ఇది” అన్నారు.
సురేశ్‌ బొబ్బిలి మాట్లాడుతూ.. ”వేణు ఉడుగుల నాకు సోదరుడితో సమానం. ప్రతి విషయం కూడా అర్థమయ్యేలా నెమ్మదిగా చెబుతారు. రోహిత్‌గారు నాకు అప్పట్లో ఒకడుండేవాడు సినిమాకు అవకాశం ఇచ్చారు. అలాగే నిర్మాతలు కూడా నమ్మకంతో ఇచ్చిన అవకాశమిది. తప్పకుండా సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అన్నారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here